౭
 ౧ పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. 
ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు. 
 ౨ విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖంతో ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. 
ఎందుకంటే చావు అందరికీ వస్తుంది కాబట్టి జీవించి ఉన్నవారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి. 
 ౩ నవ్వడం కంటే ఏడవడం మేలు. 
ఎందుకంటే దుఃఖ ముఖం తరవాత హృదయంలో సంతోషం కలుగుతుంది. 
 ౪ జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు. 
అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి. 
 ౫ మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు. 
 ౬ ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది. 
ఇది కూడా నిష్ప్రయోజనం. 
 ౭ జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే. 
లంచం మనసును చెడగొడుతుంది. 
 ౮ ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం. 
అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు. 
 ౯ కోపించడానికి తొందరపడవద్దు. 
మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది. 
 ౧౦  “ఇప్పటి రోజుల కంటే గతించిన రోజులు ఎందుకు మంచివి” అని అడగొద్దు. 
అది తెలివైన ప్రశ్న కాదు. 
 ౧౧ జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం. 
సూర్యుని కింద జీవించే వారందరికీ అది ఉపయోగకరం. 
 ౧౨ జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రత నిచ్చేవే. 
అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది. 
 ౧౩ దేవుడు చేసిన పనులను గమనించు. 
ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా? 
 ౧౪ మంచి రోజుల్లో సంతోషంగా గడుపు. చెడ్డ రోజుల్లో దీన్ని ఆలోచించు, 
తాము గతించి పోయిన తరువాత ఏం జరగబోతుందో తెలియకుండా ఉండడానికి దేవుడు సుఖదుఃఖాలను పక్కపక్కనే ఉంచాడు. 
 ౧౫ నేను నిష్ప్రయోజనంగా తిరిగిన కాలంలో నేను చాలా విషయాలు చూశాను. 
నీతిమంతులై ఉండి కూడా నశించిపోయిన వారున్నారు, 
దుర్మార్గులై ఉండీ దీర్ఘ కాలం జీవించిన వారున్నారు. 
 ౧౬ అంత స్వనీతిపరుడుగా ఉండకు. నీ దృష్టికి నీవు అంత ఎక్కువ తెలివి సంపాదించుకోకు. 
నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకుంటావు? 
 ౧౭ మరీ ఎక్కువ చెడ్డగా, మూర్ఖంగా ఉండవద్దు. 
నీ సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి? 
 ౧౮ నీవు ఈ జ్ఞానానికి అంటిపెట్టుకుని దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు మంచిది. 
దేవునిలో భయభక్తులు గలవాడు తాను చేయవలసిన వాటినన్నిటినీ జరిగిస్తాడు. 
 ౧౯ ఒక పట్టణంలో ఉన్న పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తిలో ఉన్న జ్ఞానం శక్తివంతమైంది. 
 ౨౦ ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. 
 ౨౧ చెప్పుడు మాటలు వింటూ నీ పనివాడు నిన్ను శపించేలా చేసుకోకు. 
 ౨౨ నువ్వు కూడా చాలాసార్లు ఇతరులను శపించావు కదా. 
 ౨౩ ఇదంతా నేను జ్ఞానంతో పరిశోధించి తెలుసుకున్నాను. “నేను జ్ఞానిగా ఉంటాను” అని నేననుకున్నాను గాని అది నా వల్ల కాలేదు. 
 ౨౪ జ్ఞానం బహు దూరంగా, లోతుగా ఉంది. దానినెవడు తెలుసుకోగలడు? 
 ౨౫ వివేచించడానికి, పరిశోధించడానికి, జ్ఞానాన్ని, సంగతుల మూల కారణాలను తెలుసుకోడానికి, 
చెడుతనం అనేది మూర్ఖత్వం అనీ బుద్ధిహీనత వెర్రితనమనీ గ్రహించేలా నేను నేర్చుకోడానికి, పరీక్షించడానికి నా మనస్సు నిలిపాను. 
 ౨౬ చావు కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అది ఉచ్చులు, వలలు లాంటి మనస్సు, సంకెళ్ళ లాంటి చేతులు కలిగిన స్త్రీ. 
దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకుంటారు గాని పాపం చేసేవారు దాని వలలో పడిపోతారు. 
 ౨౭ సంగతుల మూల కారణాలు ఏమిటో తెలుసుకోడానికి నేను వివిధ పనులను పరిశీలించినపుడు ఇది నాకు కనబడింది అని ప్రసంగి అనే నేను చెబుతున్నాను. అయితే నేను ఎంత పరిశోధించినా నాకు కనబడనిది ఒకటి ఉంది.  ౨౮ అదేమంటే వెయ్యి మంది పురుషుల్లో నేనొక్క నిజాయితీపరుణ్ణి చూశాను గాని స్త్రీలందరిలో ఒక్కరిని కూడా చూడలేదు.  ౨౯ నేను గ్రహించింది ఇది ఒక్కటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు గాని వారు వివిధ రకాల కష్టాలు తమ పైకి తెచ్చుకుని చెదరిపోయారు.