౪
 ౧ సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.  ౨ అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,  ౩ షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.  ౪ యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.  ౫ నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.  ౬ అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.  ౭ ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు. 
 ౮ వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు, 
 ౯ మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు, 
 ౧౦ అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు. 
 ౧౧ అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య. 
 ౧౨ అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మేహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది. 
 ౧౩ గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం. 
 ౧౪ ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా  ౧౫ నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు. 
 ౧౬ ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు. 
 ౧౭ ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు. 
 ౧౮ బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు. 
 ౧౯ గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి. 
 ౨౦ అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.  ౨౧ నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు. 
 ౨౨ రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1,200 తూముల ముతక పిండి,  ౨౩ పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.  ౨౪ యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.  ౨౫ సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు. 
 ౨౬ సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.  ౨౭ సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.  ౨౮ రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు. 
 ౨౯ దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.  ౩౦ అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.  ౩౧ అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.  ౩౨ అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు. 
 ౩౩ లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.  ౩౪ అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.